ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను వివరిస్తూ శ్రీ రత్నంగారు ఆరోగ్యగీత వ్రాశారు. ఆరోగ్యం మీద అవగాహన, చైతన్యం కలిగించటం ఆ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పాఠశాల విద్యార్థులు పునశ్చరణ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఆ పుస్తకాన్నే కాస్త మార్పులతో 115 పద్యాలకు కుదించి " ఆరోగ్య శతకం" గా అందించారు.
Saturday, March 10, 2018
ఆరోగ్యగీత
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ?
ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ?
వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి?
ప్రజారోగ్యం మీద తెలుగులో చాలా పుస్తకాలు వచన రూపంలో వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరూ పద్యాలతో పుస్తకం వ్రాయలేదు. శ్రీ రత్నం గారు ప్రజారోగ్యం మీద తెలుగులో 704 తేటగీతి పద్యాలతో "ఆరోగ్యగీత" అనే పుస్తకం వ్రాశారు. తెలుగులో ఇది మొదటి ప్రయత్నం.
ఈ విషయాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కుడా గుర్తించి ధృవపత్రం అందజేయటం జరిగింది.
పరిచయం
శ్రీ బెల్లంకొండ రత్నం గారు చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.
వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్గా పనిచేసి రిటైరైనా తన ప్రవృత్తులను మాత్రం వారు ఏనాడు అలక్ష్యం చేయ్యలేదు. వారు వ్రాసిన ఎన్నో గేయాలు, నాటికలు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమయ్యాయి. పద్మశ్రీ ఆర్ట్స్ అనే నాటక సంస్థను స్థాపించి తను రచించిన నాటకాలను, ఏకపాత్రలను ఎన్నో సార్లు స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఇతర నాటక సంఘాలతో కలిసి అనేక సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక నాటకాలలో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, జయసింహుడు, సారాసురుడు పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1991లో ఆయన రచించి, నటించిన రుక్మిణీ కల్యాణం అనే పద్యనాటిక, అవధాన చక్రవర్తి, శతావధాన సార్వభౌమ డాక్టర్ శ్రీ మేడసాని మోహన్, శతాధిక నాటక కర్త, నాటక నవరత్నం శ్రీ కొడాలి గోపాలరావు వంటి
ప్రముఖుల మన్ననలను పొంది జనబాహుళ్యంలో మంచి ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. సారా వ్యతిరేక ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో సారాసుర సంహారం అనే గేయ నాటిక వ్రాసి అనేక ప్రాంతాల్లో విరివిగా ప్రదర్శనలు ఇచ్చి జిల్లా కలెక్టరు నుంచి ప్రత్యేక ప్రశంసలు పొందారు. ఎయిడ్స్ మహమ్మరి మీద వారు వ్రాసిన దర్పణం నాటిక 2002 లో చిత్తూరు జిల్లా నుంచి చాలా కాలం తర్వాత నంది నాటక పోటీలకు ఎంపికైన నాటకంగా సంచలనం సృష్టించింది.
ఆయన ప్రజారోగ్యం, పర్యావరణం మీద కూడా ఎన్నో గేయాలు, పద్యాలు వ్రాశారు. వాటిని ప్రజలకు విరివిగా పంచి పెట్టి, ప్రదర్శనలిప్పించి చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఆయన కృషిని గుర్తించిన కళాజగతి మాసపత్రిక వారు 2004లో కళాదిత్య బిరుదంతో సత్కరించారు. 2009లో అనంతపురం జిల్లా కలెక్టరు ఉత్తమసేవా ప్రశంసా పత్రం తో గౌరవించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2010లో ఉత్తమ శానిటరీ సూపర్వైసర్గా గ్రీన్ లీఫ్ అవార్డునిచ్చి సత్కరించింది. 2014లో మంగాపురం చంద్రమౌళి పూర్హోం సొసైటి పుష్యర ప్రతిభా పురస్కారంతో సన్మానించింది.
ఇటు సాహిత్యంలోనూ వారు కొత్తపుంతలు తొక్కారు. ప్రజారోగ్యం మీదున్న మమకారంతో, ప్రముఖ వైద్య నిపుణుల సూచనలతో, ఆరోగ్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ 704 తేటగీతి పద్యాలతో ఆరోగ్యగీత అనే పుస్తకాన్ని వ్రాశారు. పాఠశాల విద్యార్థులకు పునశ్చరణ చేసుకోవటానికి వీలుగా ఉంటుందని దానినే 115 పద్యాలకు కుదించి ఆరోగ్య శతకం గా అందించారు. తెలుగులో ప్రజారోగ్యం మీద వచన రూపంలో ఎన్నో రచనలు వచ్చాయి గానీ ఇలా పద్యాల రూపంలో పుస్తకాలు, శతకాలు రావడం అదే ప్రథమం. ఈ విషయాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించి 2016లో ఆయనకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు.
శ్రీ రత్నం వ్రాసిన ఈ ప్రేమను సమాధి చేద్దాం నాటకం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటి కార్పొరేషన్ ద్వారా ఉత్తమ రచన పురస్కారం పొందింది. వారు వ్రాసిన మరో నాటకం అన్నమాచార్య 2013లో జరిగిన గరుడ జాతీయ స్థాయి నాటకోత్సవాలలో ఉత్తమ
రచన పురస్కారం పొందింది. ఈ నాటకాన్ని అన్నమయ్య వంశీకుడైన శ్రీ తాళ్ళపాక హరినారాయణరావు గారిచే ఆవిష్కరింపజేయడం విశేషం. ఇటీవలే తెనాలిలో జరిగిన 2017 నంది నాటకోత్సవాలలో తను వ్రాసిన దేవుడిచ్చిన వరం నాటకాన్ని పిల్లల చేత ప్రదర్శింపచేశారు. ఒక వైపు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చేరదీసి అలుపెరుగని ఉత్సాహంతో తర్ఫీదునిచ్చి వాళ్ళ చేత అనేక ప్రదర్శనలిప్పించి ప్రోత్సాహకాలు ఇచ్చి కళానురక్తిని రగిలిస్తూ , మరోవైపు నాటక రచనా వ్యాసంగంలో తన కళాతృష్ణను చాటుకుంటూ నిరంతర విద్యార్థిలా ఆయన శ్రమిస్తూనే ఉన్నారు.
రచనలు
పద్యనాటకాలు: రుక్మిణీ కల్యాణం, అన్నమాచార్య, వ్యాధ బోధ (అముద్రితం )
పద్యకావ్యాలు: ఆరోగ్యగీత
శతకం: ఆరోగ్య శతకం
సాంఘిక గేయ నాటికలు: సారాసుర సంహారం, మశక మర్దనం
సాంఘిక నాటికలు: దర్పణం, జ్వాల, ఈ ప్రేమను సమాధి చేద్దాం, కంటివెలుగు, గ్రహదోషం, దేవుడిచ్చిన వరం
గేయ రచనలు: పరిశుభ్రత-పచ్చదనం, బ్రతుకు-బ్రతికించు, శుచి-శుభ్రత, ఆరోగ్యం-ఆహార్యం, పర్యావరణం, సమైక్యాంధ్ర